శరవణభవ - హరోం హర
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి - పంగుణి ఉత్తిరం బ్రహ్మోత్సవము సందర్భంగా
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం
ది. 10.04.2025 , ఉదయం 8.00 గంటలకు.
శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయం నందు, విశ్వబ్రాహ్మణ కాలనీ, మచిలీపట్నం
*************
సుబ్రహ్మణ్యస్వామి - పంగుణి ఉత్తిరం బ్రహ్మోత్సవము ప్రాముఖ్యత, పూజాది ఆచారములు, పురాణ ప్రాశస్యం.
పంగుణి ఉత్తిరం బ్రహ్మోత్సవము సుబ్రహ్మణ్యస్వామి వారి పన్నెండు బ్రహ్మోత్సవములలో ముఖ్యమైన విశేషమైన ఉత్సవం మరియు మధురై మీనాక్షి సుందరేశ్వరుల తిరుకళ్యాణం జరుగు విశేషమైన రోజు.
ఈరోజు పవిత్ర వివాహ బంధమును మరియు దైవత్వమైన సంబంధమును సూచించునది.
పురాణాలు, ఇతిహాసాలు - మహాభారతం మరియు రామాయణం - వంటి హిందూ గ్రంథాలు పంగుణి నెలలో (మార్చి - ఏప్రిల్) పూర్ణిమ మరియు ఉత్తిర నక్షత్రం కలిసే శుభ దినం నాడు దైవ వివాహాలు జరిగిన రోజు అని సూచిస్తున్నాయి.
పంగుణి ఉత్తిరం అనగా తమిళ "పంగుణి" మాసం నందు వచ్చు "ఉత్తరా" నక్షత్రము, ఈ శుభ దినం నాడు భారత దేశం లోని వివిధ ప్రసిద్ధ పుణ్య క్షేత్రములలో శివ పార్వతుల, మురుగన్ దేవసేన, మరియు రంగనాథ (విష్ణు) ఆండాళ్ అమ్మవార్ల (శ్రీవిల్లిపుత్తూర్) వివాహ మహోత్సవములు విశేషంగా జరుగుతాయి.
తమిళ క్యాలెండర్లోని పన్నెండవ నెల అయిన పంగుణి , నక్షత్ర చక్రంలో పన్నెండవ నక్షత్రమైన ఉత్తిరమ్ కలిసి ఈ శుభ దినం నాడు వస్తుంది. ఈ పండుగ / ఉత్సవం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అరుదైన ఖగోళ అమరిక - ఉత్తిర నక్షత్రం పౌర్ణమి తో కలిసి వచ్చినప్పుడు, చంద్రుడు దోషరహిత తేజస్సుతో ప్రకాశిస్తాడని నమ్ముతారు. ఈ మచ్చలు లేని చంద్రకాంతి శరీరానికి మరియు మనసుకు శాంతి మరియు ప్రశాంతతను తెస్తుందని నమ్మకం.
పంగుణి ఉత్తిరం మురుగన్ మరియు దేవసేన దేవతల దివ్య వివాహాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం, ఈ పవిత్ర రోజున, సుబ్రహ్మణ్య స్వామి వారు రాక్షసుడైన తారకాసురుడిని జయించి, ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన అమ్మవారిని వివాహం చేసుకున్నారు, దేవతలు అందరు తమను రాక్షస చెరనుండి విడిపించిన సుబ్రహ్మణ్య స్వామి నూతన జంటకు తమ ఆశీస్సులను కురిపించారు. ఈ పవిత్ర దినము నాడు భక్తులు ఉపవాసం ఉంటారు, సుబ్రహ్మణ్య దేవాలయాలను సందర్శిస్తారు మరియు ప్రత్యేక ఉత్సవాలలో పాల్గొంటారు, ఆనందకరమైన మరియు సంపన్నమైన వివాహ జీవితం కోసం దైవిక అనుగ్రహాన్ని కై ఉపవాస దీక్షలు ఉంది స్వామిని వేడుకొంటారు.
ఈ రోజున భక్తులు కళ్యాణసుందర వ్రతం/ దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. పంగుణి మాసం పౌర్ణమి రోజున, పార్వతీ దేవి శివునితో వివాహం జరిగినట్టుగా పురాణాలు చెపుతున్నాయి. అందుకే, ఈ ఉపవాసాన్ని కళ్యాణ వ్రతం లేదా కళ్యాణసుందర వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ ఉపవాసం పాటించడం వలన భక్తులకు తగిన జీవిత భాగస్వామి మరియు ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన జీవితం లభిస్తుందని నమ్ముతారు. శ్రీ సీతా రాముల కళ్యాణం కూడా ఈరోజున జరిగినదని చెపుతారు. అలాగే ఈ రోజున అగస్త్య మహర్షి లోపాముద్రను వివాహం చేసుకున్న రోజు కూడా. ఈ రోజున ఉపవాసం ఉండటం, దేవాలయాలను సందర్శించడం మరియు తిరుకల్యాణం (దైవిక వివాహ వేడుక) చూడటం వల్ల వైవాహిక ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు.
పంగుణి ఉత్తిరమ్ బ్రహ్మోత్సవ ఇతర పురాణ ప్రాశస్త్యం విశేషములు :
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లో బ్రహ్మర్షి అగస్త్య మహర్షి యొక్క అంకితభావంతో ఉన్న శిష్యుడు ఇడుంబన్ (ఇడుంబాసురుడు) వృత్తాంతములో కూడా ఈ పంగుణి ఉత్తిర మూలాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యస్వామి అగస్త్య మహర్షి పైన తన అంకితభావానికి పరీక్షగా, ఇడుంబన్ రెండు కొండలను కావడిగా కట్టి తన భుజాలపై మోసుకుని దక్షిణాదికి బయలుదేరి పళణి క్షేత్రము ఏర్పడుటకు కారణమైనది, అలాగే సుబ్రహ్మణ్యుడుకి కావడి మొక్కులు తీర్చుకొను పవిత్ర ఆచారానికి నాంది పలికింది. ఫళణి క్షేత్రం యందు ఈ పది రోజులు పంగుణి ఉత్తిరమ్ బ్రహ్మోత్సవాలు జరుగును.
పవిత్ర పట్టణమైన కాంచీపురంలో, కామాక్షి దేవి ఒకసారి నది ఇసుక నుండి ఒక శివలింగాన్ని తయారు చేసి, దానిని ఎంతో భక్తితో పూజించింది. ఆమె ప్రార్థనలు మరియు అచంచల విశ్వాసం ద్వారా, కామాక్షి దేవి శివుని ఆశీర్వాదం మరియు దైవిక కృపను పొందినది ఈరోజుననే.
తిరువారూర్ త్యాగరాజ స్వామి (త్యాగేశ్వర) స్వామి ఆలయంలో సంవత్సరమునకు ఒకమారు మాత్రమే నటరాజస్వామి వారి ఎడమ పాదము యొక్క దర్శన భాగ్యం భక్తులకు ఉండును. ఇక్కడ శివుడు సోమస్కంద మూర్తి గా భక్తులకు దర్శనం ఇచ్చును. సోమస్కంద రూపంలో, శివుడు తన ఎడమ వైపున పార్వతి దేవిని మరియు మధ్యన (బాలమురుగన్) స్కందుడు కూర్చుని ఉంటాడు. ఈ మూర్తిని మొదట శ్రీమహావిష్ణువు పూజించేవారు అని అక్కడి స్థల పురాణం, భగవాన్ శ్రీమహావిష్ణువు ఆ మూర్తిని తన హృదయానికి దగ్గరగా ఉంచుకునేవాడని మరియు భగవాన్ శ్రీమహావిష్ణువు ఊపిరి పీల్చుకున్నప్పుడు అది పైకి క్రిందికి వెళ్ళేదని నమ్ముతారు. తరువాత, ఆ మూర్తిని ఇంద్రుడికి ఇచ్చారు. శివుని యొక్క గొప్ప భక్తుడైన చోళ రాజు ముచుకుందుడు ఇంద్రుడి నుండి ఆ మూర్తిని పొంది ఇక్కడి ఆలయంలో ముచుకుందుడు ప్రతిష్టించాడు అని స్థల పురాణం.
ముచుకుంద సహస్రనామ అర్చన అనేక నైవేద్యాలతో పాటు ఈ రోజున స్వామికి సమర్పిస్తారు. ఆరోజున అర్చన, అన్నప్రసాదాలు భక్తులు సమర్పిస్తారు. చక్కర పొంగలి, పెసర పొంగలి, జంతికలు, మురుక్కు, పెరుగు అన్నం, పులిహోర , పాయసం మరియు ప్రసిద్ధ మజ్జిగ పులుసు అన్నం ఈ రోజున స్వామికి సమర్పిస్తారు.
చెన్నైలోని కపాలీశ్వరర్ ఆలయంలో జరిగే అరుబతిమూవర్ ఉత్సవం 63 మంది నాయన్మార్లకు (శివుని భక్తులైన దాసులకు) ప్రత్యేక పల్లకి ఉత్సవం జరుగును, రాష్ట్రం నలుమూలల నుండి శివ భక్తులను ఈ పండుగ ఆకర్షిస్తుంది. ఈ పండుగ 63 మంది నాయన్మార్ల భక్తి మరియు బోధనలను గౌరవిస్తూ శైవ మతానికి నాయన్మార్ల చేసిన విశేష భక్తి రస కీర్తనలు రచనలను సేవలను గుర్తుచేసుకొని వారి 63 పంచలోహ విగ్రహాలను గొప్ప ఊరేగింపుగా పల్లకీలపై తీసుకువెళతారు. భక్తులు వీరు రచించిన కీర్తనలు పాడుతూ, భజనలు ప్రార్థనలు చేస్తూ వీధుల్లో నగరోత్సవము జరుపుతారు.
శివుని దివ్య నృత్యం (తాండవం)ను ప్రత్యక్షంగా చూసిన ఏకైక మానవ మహిళ కారైకల్ అమ్మయ్యర్ మోక్షం (విముక్తి) పొందింది ఈరోజు.
***
సేకరణ & అనువాదం :
రవికుమార్ P.
కార్తికేయ సేవ ట్రస్ట్,
మచిలీపట్టణం
9059065452
No comments:
Post a Comment